రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజాలు - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజాలు

కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని పారిశ్రామిక దిగ్గజాలు స్వాగతించాయి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 10 శాతానికి సమానమైన ఈ ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని నేడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనున్నారన్న సంగతి తెలిసిందే.



ప్రధాని ప్రసంగంపై స్పందించిన మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా, ప్రధాని ప్రసంగం అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుందని అన్నారు. బతికితే చాలనుకునే స్థాయి నుంచి, బలపడే స్థాయికి మారేందుకు అవకాశాన్ని దగ్గర చేసిందని ఆనంద్ మహీంద్రా, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఇది 1991లో ఇండియాలో వచ్చిన ఆర్థిక పరివర్తనా క్షణాల వంటివేనా? కాదా? అన్నది రేపటి రోజుల్లో తెలుస్తుందనీ, ప్రధాని ప్రసంగం చూసిన తరువాత, తనకు ఈ రాత్రి సరిగ్గా నిద్రపట్టదేమోనని ఆయన చమత్కరించారు.



గౌతమ్ అదానీ స్పందిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ, కేవలం చారిత్రాత్మకమే కాదని, భూమి, కార్మికులు, ద్రవ్య లభ్యత, చట్టాలు తదితర ఎన్నో విభాగాలపై దృష్టి సారించిన అద్భుతమని కొనియాడారు. దీని వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇండియాను వృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లే దిశగా, నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఓ కీలకమైన అడుగు వేసిందని వ్యాఖ్యానించారు.